Tuesday, September 10, 2013

వాడినేది కోరేదీ

'ఆది భిక్షువు వాడినేది కోరేదీ? బూడిదిచ్చే వాడినేది అడిగేది? ఏది కోరేదీ? వాడినేది అడిగేదీ?' అని సందిగ్ధావస్తకు లోనయ్యాడు హరిప్రసాద్ పండితుడు. అయితే ఏది కోరాలి అని కాక ఎందుకు కోరాలి అన్నది నా ప్రశ్న. చిన్నప్పన్నుండి పెద్దవాళ్ళు భగవంతున్ని ఏదో ఒకటి కోరుకోవాలనే నేర్పిస్తారు. భగవంతుడిని చూడటం అన్నా, తనదగ్గరికి వెళ్ళటం అన్నా, చివరికి తనగురించి ఆలోచించడం అన్నా ఏదో ఒకటి కోరుకోవడానికే అని నేర్పిస్తారు. మంచి మార్కులు రావలనో, ఫస్ట్ రావాలనో, ర్యాంక్ రావలనో ఏదో ఒకటి భగవంతున్ని కోరుకొమ్మని చెబుతారు. ఇంక పెద్దయ్యక పెళ్ళవ్వాలనో, కొంగుముడి వేసుకున్న కొత్తదంపతులను కొడుకు పుట్టలని కోరుకొమ్మనో చెబుతారు. ఈ మధ్య మా మిత్రుడొకడు అనుకోకుండా తిరుపతి వెళితే 'ఏమి కోరుకుంటారు, ఏదైనా కోరుకొండి ' అని చెప్పిందట వాళ్ళావిడ. ఈ కోరుకోవడమనేది మనకు ఎంతగా అలవాటయ్యిందంటే, మనకు తెలిసిందల్లా భగవంతున్ని ఏదో ఒకటి కోరుకోవడమే, కోరుకోకుంటే భగవంతుని దగ్గరికెళ్ళడమే వృధా. అసలు భగవంతున్నెందుకు కోరుకోవాలి? మనకు దేనికి అర్హత ఉందో దేనికిలేదో ఆయనకు తెలీదా? కోరుకున్నామని అర్హత లేకున్నా ఇస్తాడా? కోరుకోకుంటే అర్హత ఉన్నా ఇవ్వడా?

శ్రీ కృష్ణుడు భగవద్గీతలో, "పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రహచ్చతి; తదహం భక్త్యు పహృత మశ్నామి ప్రయతాత్మనః" అన్నాడు. ఇక్కడ పత్రం పుష్పం ఫలం తోయం అన్నాడని అవి మాత్రమే కాదు, ఏదైనా అని అర్ధం, అది నమస్కారమే కావచ్చు. భగవంతుడు తనకు ఇచ్చేది ఏదైన భక్తితో ఇవ్వమన్నాడు, అలా ఇస్తే దాన్ని ప్రీతితో స్వీకరిస్తా అన్నాడు. ఘంటసాల భగవద్గీతలో 'ఫలాపేక్ష రహితంగా' అని భావం చెప్పారు. శ్లోకంలో ప్రత్యేకంగా 'ఫలాపేక్ష రహితంగా' అని చెప్పకపోయినా ఆ భావం అంతర్గతంగా ఉంది. ఇక్కడ సాక్షాత్తు భగవంతుడే ఏ కోరికా కోరుకోకుండా పూజించమని చెప్పాడు కదా? మరి భౌతిక ప్రపంచంలో కోరికలను ఎందుకు కోరాలి? ఇంకొదరు భౌతిక ప్రపంచంలోది కాని పుణ్యాన్ని కోరుకుంటారు. అది కూడా భగవంతున్నుండి కోరడానికి తగదు.  శ్రీ కృష్ణుడు భగవద్గీతలో, "వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టమ్ ! అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగీ పరం స్థానముపై తిచాద్యమ్!!" అన్నాడు. ఇక్కడ పుణ్యాన్ని కూడా దాటెయ్యమన్నాడు. అంటే మొత్తం మీద భగవంతున్ని భౌతికలోకంలో కోరికలు కానీ, పుణ్యం కానీ కోరుకోకూడదని గీతాకారుడు చెప్పాడు.

భగవంతున్ని ఏదీ కోరుకోకూడదా? భగవంతునినుండి కోరుకోవడానికి దేనికీ అర్హత లేదా అంటే ఒక్కటుంది. భగవంతున్ని ఎప్పుడూ కోరుకోవలసింది ఒక్కటుంది. అదేంటంటే భగవంతుండే. భగవంతున్నుండి మనం కోరుకోవలసింది భగవంతు న్ని మాత్రమే. ఓ భగవంతుడా, అనునిత్యం నాకు తోడుగా ఉండు అని కోరుకోవచ్చు. అలా చేయడం సాధ్యమా? భౌతికంగా సాధించవలసినవి, పొందవలసినవి, కావలసినవి ఎన్నో ఉండగా వాటినన్నింటినీ కాదని భగవంతున్నెవరైన కోరుకుంటారా?’ ఇది చలా మంది అడిగే ప్రశ్న. అంటే, దానికి ప్రత్యక్ష ఉదాహరణ మనకు మహాభారతంలో కనిపిస్తుంది అర్జునుని రూపంలో. మహాభారత యుద్దం సమీపిస్తుంది. యుద్దంలో గెలవాలని పాడవులు, కౌరవులు రకరకాల వ్యూహరచనలు చేస్తున్నారు. యుద్దానికి సైన్యాన్ని సమీకరిస్తున్నారు. తమ పక్షాన యుద్దంలో పాల్గొనమని శ్రీ కృష్ణున్ని అడగడానికి అర్జునుడు, దుర్యోధనుడు ఇద్దరూ వెళ్ళారు. భగవంతుడు తన సర్వ సైన్యన్ని ఒకవైపు, తనని ఒకవైపు పెట్టాడు. తను ఆయుధం పట్టను అని కూడా చెప్పాడు. ఈ రెంటిలో ఏది కావాలో కోరుకొమ్మన్నాడు. ఇక్కడ అర్జునుని పరిస్తితి చుస్తే, తను గెలవాల్సింది యుద్దం. అది భౌతిక ప్రపంచంలో జరగాలి. ఎవరికి ఎక్కువ సైన్యం, అస్త్ర, శస్త్రాలు ఉంటే వాళ్ళే గెలుస్తారు. ఇక శ్రీ కృష్ణుడేమో ఆయుధం కూడా పట్టనన్నాడు. ఒక భక్తుడు (అర్జునుడు) భగవంతుని దగ్గరికొచ్చాడు, తనకోరిక భౌతికమైనది. భౌతిక ప్రపంచంలో యుద్దంలో గెలవాలి. మరి భగవంతున్ని ఏది కోరాలి? భౌతికమైన సైన్యమా లేక భగవంతున్నా? అర్జునుడు మనలా ఆలోచిస్తే సైన్యాన్నే కోరేవాడు. కానీ తను నిజమైన భక్తుడు, తనకు సైన్యం అవసరంలేదని భగవంతున్ని తనవైపు నిలవమని కోరుకున్నాడు. భక్తుని కోరికకు సంతృప్తి పొంది భగవంతుడు అనునిత్యం భక్తుడి వెంట ఉండి, రక్షించి, యుద్దంలో గెలిపించాడు. భగవంతుడెక్కడుంటే గెలుపు అక్కడే ఉంటుంది.


అందుకే మనం కూడా భగవంతునినుండి భౌతికమైన గెలుపు కాకుండా భగవంతున్నే కోరుకుంటే, గెలుపు కూడా తనతోపాటే మనవద్దకొస్తుంది. శ్రీ కృష్ణుడు గీతలో, "అనన్యాశ్చిన్తయన్తో మాం యే జనాః పర్యుపాసతే! తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్!!" అన్నాడు. అనన్య భక్తితో అనునిత్యం తననే పూజించే భక్తుని యోగక్షేమాలు తానే చూసుకుంటానని మాటిచ్చాడు. నమ్మకమా? సందేహమా?

3 comments: