Saturday, January 4, 2014

కొత్త సంవత్సర శుభాకాంక్షలు

కాల చక్రం మరో భ్రమణం పూర్తి చేసుకుంది, నూతన సంవత్సరం రానేవచ్చింది, అభినందనల సందడులు హడావిడులు సద్దుమనిగాయి, మళ్ళీ అంతా మామూలు అయిపోయింది, కొత్తసంవత్సరానికి అందరు అలవాటుపడిపోయారు. కానీ నవ వసంతానికి స్వాగతవాక్యం పలకాలన్న నా కోరిక మాత్రం అలాగే మిగిలిపోయింది. ఇంక లాభంలేదు అని మనసు చెవి మెలివేసి, కూర్చోబెట్టి ఏదైనా చెప్పు నేను రాస్తా అంటే, ఎందుకో నా మనసు భావాన్ని పలకలేను అని మౌనంగా ఉండుపోయింది. పోయిన సంవత్సరం రాసినకొత్త సంవత్సరానికి స్వాగతం’ను చదివి చూడు, అప్పుడైనా ఏవైనా కొత్త తలపులు తలుపు తడుతాయేమో ప్రయత్నించు అంటే మళ్ళీ పాత భావాలే పలుకుతా అంటుంది.

ఏమైంది ఈ మనసుకివాళ? ఎందుకీ మౌనం? ఏమిటీ నిరాసక్తత? ఎప్పుడూ నాతో ఏదో ఒక కత చెప్పే ఈ మనసు ఇవ్వాళ నేను చెప్పమని అడిగినా స్పందిచదెందుకు. మనసు ఏమి ఆలోచిస్తుందా అని తొంగి చూస్తే.... ఏ సంవత్సర చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం. వచ్చేటప్పుడు ఆశపెడితే, వచ్చాక ఏడిపి స్తుంది. ఆశలన్నీ నిరాశలయితే, కలలన్నీ కల్లలయితే, పన్నీరుగా కనిపించినవన్నీ నిజానికి కన్నీరని తేలితే.. ఆ సంవత్సరమంతా బాధను దిగమిందుకుని మళ్ళీ కొత్తసంవత్సరానికి ఆశతో స్వాగతం పలకనా? ముందున్నది నిరాశే అని తెలిసి ఆశపడనా? ఆశపడి భంగపడనా?...  ఆలోచన రాగానే నైరాశ్యంతో laptop పక్కన పడేసి కళ్ళుమూసుకున్నా....

"క్లైబ్యం మాస్మగమః" ఎక్కడినుండో వినిపించింది కంఠం. ఎవరా అని చూస్తే ఎదురుగా శ్రీ కృష్ణ పరమాత్మ, భగవద్గీతలో నుండి చిరునవ్వు చిందిస్తూ కనిపిచాడు. చిరునవ్వు సకల దుఃఖాలను పారద్రోలే ఆనంద స్వరూపంతో శోభిస్తుంది. దివ్య మంగళ చరణాలకు మనసులోనే ప్రణమిల్లు వేళ,
స్వామి: క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్త్వయ్యుపపద్యతే| క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప||
(ఈ శ్లొకం ఎక్కడో విన్నట్టు అనిపించి, బాగా ఆలోచించి)
 నేను: స్వామీ! శ్లోకం మీరు గీతలో అర్జునికి చెప్పారు కదా, మరి ఇప్పుడు నాకెందుకు చెబుతున్నారు?
స్వామి: అనాడు అర్జునుడు కర్తవ్యాన్ని వీడి హృదయ దౌర్భల్యాన్ని పొందాడు. ఈనాడు నీవు భవిష్యత్తు అంటే భయంతో హృదయ దౌర్బల్యాన్ని పొందావు. పిరికి తనమునకు లోనుకావద్దు. నీకిది ఉచితము కాదు. తుచ్చమైన హృదయ దౌర్బల్యమును వీడి, కార్యోన్ముఖుడవు కమ్ము. తప్పక లక్ష్యాన్ని పొందుతావు.
నేను: కానీ స్వామీ! టెర్రరిస్ట్ బాంబు పేలుళ్ళు వాటిలో ఎంతో మంది అమాయకుల మరణం, రైలు ప్రమాదాలు, హత్యలు, ఆత్మహత్యలు.. ఇవ్వన్నీ ప్రతి సంవత్సరం వింటూనే ఉన్నా, చూస్తూనే ఉన్నా. సంవత్సరం కూడా వింటాను చూస్తాను. అలా చనిపోతున్నవారిని గురించి ఆలోచనవస్తేనే మనసు వ్యాకులత చెందుతుంది.
స్వామి: గతాసూన గతాసూంశ్చ నానుసోచంతి పండితాః
వివేకం కలవారు చనిపోయిన వారిని గురించి కానీ, బ్రతికి ఉన్నవాళ్ళను గురించి కాని బాధపడరు.
దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాన్తరప్రాప్తిః ధీరస్తత్ర ముహ్యతి||
మనుష్యునకు ఈ దేహమున బాల్యము యవ్వనము ముసలితనము ఎట్లో మరొకదేహమును పొందుటకూడ అటువంటిదే. కావున ఈ విషయమై చింతించకుము.
జాతస్య హి ధృవో మృత్యుః - పుట్టినవానికి మరణము తప్పదు అని గ్రహించి శోకింపకుండుము.
నేను: సరే స్వామి! మీరు చెప్పారు కనుక ఆ విషయం వదిలేస్తా. ఒక నిమిషం నా విషయమే ఆలోచించుకుందాం. ప్రతిసంవత్సరం ఏదో చేయాలనుకోవడం, ప్రయత్నించడం, విఫలమవడం మళ్ళీ బాధపడటం. అవి పొందలేకపోతున్నా అన్న ఆలోచనతో, పొందలేనేమో అన్న బాధతో వాటికోసం ప్రయత్నించాలన్న ఇచ్చ కూడా కలగడం లేదు. దీనికి నీ సమాధానం ఏంటి స్వామీ?
స్వామి: ధ్యాయతో విషయాన్ పుంసః, సంగస్తేషూపజాయతే| సంగాత్ సంజాయతే కామః, కామాత్ క్రోధోభిజాయతే||
క్రోధాద్భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాద్బుద్ధినాశో, బుద్దినాశాత్ ప్రణశ్యతి||
నీవు నీ కోరికల గూర్చి ఎక్కువగా ఆలోచిస్తున్నావు. అందుకే సంకట స్తితి.
మనుష్యులు విషయం గురించి ఎక్కువ ఆలోచిస్తారో దానిపై వారికి అనురాగం కలుగుతుంది, అనురాగం కామముగా మారుతుంది. అవి నెరవేరనిచో క్రొధం కలుగుతుంది. క్రోధం వలన అవివేకం ఆవేశం కలిగి తనను తాను మరచిపోతాడు. అజ్ఞానంతో అవివేకంతో ప్రవర్తిస్తాడు.
కనుక నీవు కోరికల గురించి ఎక్కువగా ఆలోచించకు, నీవు చేయవలసిన పనులను కేవలం బాధ్యతగా నిర్వర్తించు.
సుఖ దుఃఖే సమే కృత్వా లాభా లాభౌ జయా జయౌ| తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాప మవాప్స్యసి||
యోగస్థః కురు కర్మాణి సంగం త్యాక్త్వా ధనంజయ| సిధ్యసిధ్ద్యో సమో భూత్యా సమత్వం యోగ ఉచ్యతే||
నీవు ఫలితమునందు ఆసక్తిని వదలి యోగ భావనతో నీ పనులను నిర్వర్తించు. సుఖ, దుఃఖాలను జయాపజయాలను సమానంగా భావించి కేవలం కర్తవ్య నిర్వహన కోసం కార్యోన్ముఖుడవు కమ్ము. నీవు కోరుకున్న ఫలితం కలిగినా కలగకున్నా సమాన భావంతో స్వీకరించు.
కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన| మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోస్త్వకర్మణి||.
నీ కర్తవ్యం ఉద్దేశించినటువంటి పనులను చేయడానికే నీకు అధికారం ఉంది. దాని ఫలితాన్ని నిర్దేశించే అధికారం నీకు లేదు. ఫలితం మీద అధికారం లేదు కదా అని కర్మలను చేయటం మానకు. నీవైపు నుండి నీ కర్తవ్యాన్ని ఫలాపేక్షరహితుడివై నిర్వర్తించు.
అయితే నీ కర్మకు ఫలితం రాదేమో అని నిరాశ చెందకు
యే యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం
ఎవరెవరు ఏయే విధంగా నన్ను పూజిస్తున్నారో, ఎవరు ఎయేవిధంగా నిష్కామ కర్మ అనుసరిస్తున్నారో వారికి వారి వారి కర్మానుసారంగా ఫలితాన్ని ప్రసాదిస్తున్నాను.
నిష్కామ భావంతో ఫలితం గురించి ఎదురు చూడకుండా జయాపజయాలను సమాన భావంతో అంగీకరిస్తూ నీ కర్మలు ఆచరించు. దానికి తగిన ఫలాన్ని నేను అనుగ్రహిస్తాను.
నేను: స్వామీ! కానీ ఇదంతా నేను ఆచరించగలనా? నా మనస్సు నిష్కామ కర్మను చేయగలదా? అది ఎప్పుడు ఫలితం గురించే ఆలోచిస్తుంది.
స్వామి: అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలమ్| అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే||
అవును మనసుని నిగ్రహించడం చాలా కష్టసాధ్యమైన విషయమే. కానీ నిరంతర ప్రయత్నంతొ అభ్యాసించడం వలన దానిపై నిగ్రహాన్ని సాధించవచ్చు.
నేను: (మనసులో - అవును నిరాశ చెంది ప్రయోజనం లేదు. నా వంతు కర్తవ్యాన్ని ఫలితం దక్కదేమో అని నిరాశ చెందక నూతనోత్సాహంతో చేయవలసిన నిర్వర్తిస్తా- అనుకుని; స్వామీతో) స్వామీ| రేపు నీ గుడికి వచ్చి నిన్ను దర్శించుకుంటాను. నీకు కొబ్బరికాయ కొట్టనా, లేక పూజ చేయించనా?
స్వామి: పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి| తదహం భక్త్యుపహృతమ్ అశ్నామి ప్రయతాత్మనః||
డాంబికాలకు పోకు. నిర్మలమైన భక్తితో నీవు ఏది సమర్పించినా మిక్కిలి ప్రేమతో స్వీకరిస్తా. అది పత్రమైనా, పుష్పమైనా, ఫలమైనా, మరేదైనా. భక్తిలేకుండా దాంబికంగా నీవు గుడికట్టించిననూ అది నన్ను చేరదు.
నేను: (మనసులో) - నిష్కామ భావంతో సకల కర్మలు నిర్వర్తించాలి అది పూజ అయినా సరే అని ఆలోచిస్తుండగా.. ఉత్తిష్ఠత జాగ్రత ప్రాప్య వరాన్ నిబోధత అని మేలుకొలుపు వింపించింది.

కఠోపనిషత్తు నుండి యమ ధర్మరాజు "ఉత్తిష్ఠత జాగ్రత ప్రాప్య వరాన్.." (లే, మేలుకో, నీ గమ్యాన్ని చేరుకో.. Arise, awake, and stop not till the goal is reached) అంటూ కర్తవ్యాన్ని తెలియజేస్తున్నాడు. అది విన్న నా మనసులో స్వామీ వివేకానంద చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి. “దేనికీ భయపడవద్దు. మీరు అద్భుతమైన పనులను సాధిస్తారు. భయపడిన మరుక్షణం మీరు నాశనమైనట్టే. ఈ ప్రపంచంలోని బాధలన్నింటికి మహా కారణం భయమే. మూఢనమ్మకాలన్నింటిలోకి పెద్దది భయమే మన దుఃఖాలన్నింటికి కారణం భయం. నిర్భయత్వం మనిషికి ఒక్కక్షణంలో ముక్తిని తెచ్చిపెట్టగలదు. కాబట్టి, ‘లేవండి! మేల్కొనండి! గమ్యాన్ని సాధించేవరకు ఆగకండి’” అన్న మాటలు.
ఎంత అందమైన పిలుపు, భయాన్ని వీడి కర్తవ్యాన్ని నిర్వర్తించమంటూ అలా ప్రయత్నించి మన భవిష్యత్తును మనల్నే నిర్మించుకొమ్మని. మూర్ఖులు, అజ్ఞానులు తమ శక్తిని నమ్మకుండా అదృష్టాన్ని, జాతకాన్ని నమ్ముతారు. మరి నేను కూడా ఆ మూర్ఖుళ్ళో ఒకన్నా? కాదు. అలా ఏనాటికి కానివ్వను. నేను నా శక్తితో నా భష్యత్తును రచించుకుంటా. ఏ జాతకానికి ఏ గ్రహానికి తలొంచని భవిష్యత్తును నిర్మించుకుంటా. గ్రహాల ప్రభావం ఉండొచ్చుగాక దాని ప్రభావాన్ని ఎదురించి నా భవిష్యత్తును తీర్చిదిద్దుకునే శక్తి నాకు ఉంది.  నిరాశ, నిస్పృహలతో బాధపడాల్సిన అవసరం నాకు లేదు. ముల్లోకాలను నా పాదాల చెంతకు చేర్చుకునే శక్తి నాలో ఉంది. ఆ శక్తిముందు ఏ దుష్ట శక్తి, దుష్ట గ్రహం నిలువలేదు.

మన ఆలోఛనలే మన శీలాన్ని నిర్ణయిస్తాయి కదా. మన ఆలోచనలే మన ప్రస్తుత పరిస్తితిని, రేపటి గమ్యాన్ని నిర్ధారిస్తాయి కదా. ఒక్క చెడు ఆలోచన జీవితాన్ని అథః పాతాలనికి తీసుకుపోగలదు అలాగే ఒక్క మంచి ఆలోచన మనల్ని విశ్వవిజేతను చేయగలదు. అందుకే ఎప్పుడు మంచి ఆలోచనలతో, గెలుపును శాసించగలమనే ధైర్యంతో, మన శక్తి మీద నమ్మకంతో, ఓటమి భయంలేకుండా కర్తవ్యనిర్వనకు ముందడుగేద్దాం.
మిత్రులారా! రండి.. ఈ కొత్త సంవత్సరంలో గెలుపుని పాదాక్రాంతం చేసుకుందాం..


బ్లాగు మిత్రులందరికి కొత్త సంవత్సర శుభాకాంక్షలు.